Tuesday, April 4, 2017

శ్రీరామనవమి పద్యాలు

హేవళంబినామ సంవత్సర చైత్రశుద్ధ నవమి.

ఇవిగో శ్రీ రాముని గొప్పదనం తెలుపుతూ నేను వ్రాసిన పద్యాలు

సీ. ఎనలేని సంపద లొనగూడి నట్లుండి, మాయమై పోయినన్ మథనపడడు
సిరులదేవతవంటి సీతమ్మ తోడుగా నడచిన చాలని నమ్మియుండి
వేవేల రక్కసుల్ వెనువెంట నిక్కట్లు వేగాన మూగినన్ వెతలబడ డ
నంత తేజు డనుజు డంతటన్ నీడగా నిలచిన మేలని నెమ్మదించి

తే. పోరు కుద్బలుఁ గెలువంగ పూనివచ్చె
శత్రుభీకర రుద్రుండు మిత్రు డనుచు
ననిమిషాంశపు పరివార మటులయుండ
పుడమియం దాత డవతార పురషుఁ డయ్యె

మ. పరికింపన్ సిరిరూపు సీతయన, శ్రీప్రాణేశ్వరుం డాతఁడే
అరయం దమ్ము డనంత రూపుడన, నయ్యక్షాని కం డాతఁడే
చిరజీవుం డనుమయ్య రుద్రుఁడన, నా శ్రేష్ఠాత్ము నిష్ఠాతఁడే
స్థిరపూజ్యుల్ పరివారమై చనుట జేజేపట్టె ముల్లోకముల్

వివరణ

చేతికందుతుందనుకున్న రాజ్యము కైకేయి కోరికల వలన మాయమైపోయింది. అయినా కలతచెందలేదు రామయ్య. సిరులదేవత (గృహలక్ష్మి లేక శ్రీమహాలక్ష్మి) వంటి భార్య తనవద్దనుంటే అదే అన్నిసంపదలకూ సరియని సరిపెట్టుకున్నాడు. శ్రీహరికి తోడుగానుండేది సంపదలకొమ్మ లక్షీదేవియే కదా.

ఎందఱో రాక్షసులు ముట్టడించి కష్టాలపాలుజేసినా బాధపడలేదు. అనంతమైన తేజము (లేక ఆదిశేషుని వంటి తేజము అని కూడా అనుకోవచ్చు) కలిగియున్న తమ్ముడు నీడగా ఉన్నాడనే నెమ్మదితో.  శ్రీహరి ఆదమఱచి పరుండేది ఆదిశేషుని నీడులోనే కదా. 

ఇక, బలవంతుడైన వాడిని (ఉద్బలుణ్ణి) పోరులో గెలవడానికి వెనుకాడలేదు, శత్రువులను చీల్చిచెండాడే రుద్రుడు (రౌద్రరూపుడు లేక శివుని అంశము గలవాడు) తనకు మిత్రుడై ఉన్నాడని.

ఇట్టి దైవాంశసంభూతులు పరివామై ఉండడం వల్లనే ఆ మహానుభావుడు అవతారపురుషుడయినాడు.

సిరులదేవతకూ, అనంత తేజమునకు, రుద్రుండు - ఈ మూడు పద లేక పదబంధాలకు గల రెండర్థాలు తెలియజేస్తోంది తఱువాత పద్యము.  అక్షము అంటే పాము (శేషుడు).  మత్తేభపద్యములో మిగతాభాగము సులభగ్రాహ్యమనే భావిస్తున్నాను.

నమస్సులు.

No comments:

Post a Comment